More

    ఫాస్ట్ టాగ్ లేదంటే అంతే.. కొత్త రూల్స్ కఠినం

    వాహనదారులకు సంబంధించి ఇది అతి ముఖ్యమైన వార్త. ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి టోల్ గేట్ల వద్ద ఓ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఫాస్టాగ్ లేనిదే టోల్ గేట్ల వద్ద నుంచి వాహనం కదలదు. అన్ని లేన్లు ఫాస్టాగ్ లేన్లుగా మారిపోయాయి. మరి ఇప్పటిదాకా ఫాస్టాగ్ తీసుకోలేని వారి పరిస్థితి ఏంటన్నదానిపై కేంద్ర రవాణాశాఖ క్లారిటీ ఇచ్చింది.

    టోల్ గేట్ల వద్ద భారీ రద్దీని తొలగించేందుకు, సులభతర చెల్లింపుల మేరకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 80శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. రోజూ 89 కోట్ల రూపాయలను ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని 2.54 కోట్ల మందికి పైగా వాహనదారులు ఇప్పటికే ఫాస్టాగ్ ను పొందారు. అదే సమయంలో ఫాస్టాగ్ విషయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూడా కేంద్రం పరిష్కారం చూపించింది. ఫాస్టాగ్ విషయంలో వాటిని జారీ చేసిన సంస్థలు పెట్టిన మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేసింది. అంతేకాకుండా వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లో టోల్ చార్జి చెల్లించేందుకు తగిన డబ్బులేకున్నా పేమెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలనీ, ఫాస్టాగ్ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఏర్పడితే, తదుపరి రీచార్జ్ నుంచి మినహాయించుకోవచ్చునని తెలిపింది.

    ఫాస్టాగ్ ఖాతా నెగిటివ్ లో ఉన్నట్టయితే వారిని టోల్ గేట్ల నుంచి అనుమతించబోమని వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ రహిత చెల్లింపులు ఉండవు. ఫాస్టాగ్ లేని వారికి ప్రత్యేక కౌంటర్లు ఏమీ ఉండవు. అయితే ఫాస్టాగ్ లేని వారి పరిస్థితి ఏంటీ..? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ విషయమై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఫాస్టాగ్ లేని వారి విషయంలో పలు సూచనలు జారీ చేసింది. ప్రతీ టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ కౌంటర్లు ఉంటున్నాయి. ఫాస్టాగ్ లేని వారు ఆ కౌంటర్ల వద్దకు వెళ్లి ఫాస్టాగ్ ను కొనుక్కోవచ్చు. అదే సమయంలో వాహనం ఆ టోల్ గేట్ నుంచి బయటకు వెళ్లాలంటే మాత్రం డబుల్ చార్జీ చెల్లించాల్సిందే.

    ఫాస్టాగ్ పొందేందుకు మరింత సమయం ఇస్తారా.? అన్న ప్రశ్నకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి అనీ, ఇప్పటికే ఎన్నో సార్లు గడువును పెంచుకుంటూ పోయామని ఆయన అన్నారు. ఫాస్టాగ్ గడువును మరోసారి పెంచేది లేదన్నారు.

    Related Stories