ఆర్థికరంగంలోనే కాదు.. సైనిక రంగంలోనూ భారత్ దూసుకుపోతోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా సైనిక ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఎప్పుడూ టాప్ 5 కి అవతల వుండే భారత్.. తొలిసారి టాప్ 4 పొజిషనల్ లోకి వచ్చింది. ప్రపంచంలో నాలుగో సైనికశక్తిగా అవతరించింది. తాజాగా ‘మిలటరీ డైరెక్ట్’ అనే రక్షణ రంగ వెబ్సైట్..‘అల్టిమేట్ మిలటరీ స్ట్రెంత్ ఇండెక్స్’ పేరుతో ఓ గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం.. జిత్తులమారి చైనా.. అమెరికాను దాటి మొదటిస్థానంలో నిలిచింది. 100 పాయింట్లకు గాను 82 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలిచింది. 74 పాయింట్లతో అమెరికా రెండో స్థానంలో నిలవగా.. 69 పాయింట్లతో రష్యా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక, 61 పాయింట్లతో భారత్ 4వ స్థానాన్ని ఆక్రమించింది. భారత్ తర్వాత 58 పాయింట్లతో ఫ్రాన్స్ 5వ స్థానంలో నిలవగా.. 43 పాయింట్లతో యూకే 9వ స్థానానికి పడిపోయింది.
రక్షణ బడ్జెట్, ఆయుధ సంపత్తి, సైనిక బలగం, భూతల, గగన, సముద్ర వనరులు, సగటు వేతనాలను పరిగణనలోకి తీసుకుని.. ‘మిలటరీ డైరెక్ట్’ దేశాల ర్యాంకులను నిర్దేశించింది. సముద్రంలో చైనా, గగనతలంలో అమెరికా, భూతలంలో రష్యా మొదటి స్థానాల్లో ఉంటాయని నివేదిక తెలిపింది. గగనతలానికి సంబంధించి అమెరికా వద్ద మొత్తం 14,141 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రష్యాకు 4,682, చైనా వద్ద 3,587 యుద్ధ విమానాలున్నట్టు పేర్కొంది. అదే భూతల ఆయుధాలకు సంబంధించి రష్యా వద్ద అధునాతనమైన 54,866 వాహనాలు, ఆయుధ సంపత్తి ఉన్నట్టు వెల్లడించింది. అమెరికా వద్ద 50,326, చైనా వద్ద 41,641 యుద్ధ వాహనాలున్నట్టు పేర్కొంది. చైనా వద్ద అత్యధికంగా 406 సముద్ర యుద్ధ నౌకలున్నాయని చెప్పింది. రష్యాకు 278, అమెరికా, భారత్ లకు చెరో 202 ఉన్నాయని నివేదిక తేల్చింది.
ఇదిలావుంటే, ప్రపంచంలో అతి ఎక్కువ మిలిటరీ బడ్జెట్ మాత్రం అమెరికాదే. ఆ దేశం ఏడాదికి 73200 కోట్ల డాలర్ల బడ్జెట్ను రక్షణ రంగానికి కేటాయిస్తుంది. చైనా 26100 కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో, 7100 కోట్ల డాలర్లతో ఇండియా మూడోస్థానంలో ఉన్నాయి.