సింహం వలె పోరాడిన యోధుడు వంద యుద్ధాల తర్వాత బరి నుంచి బయటకు వచ్చినట్టే ఉంటుంది. విజయంపై నిశ్చితమైన అంచనా. యుద్ధ మైదానంలో బెరుకు లేని సాహసం. కించిత్ భయంలేని కఠోర పరిశ్రమ. సరిహద్దును తాకనీయడు. సైనికుడి ధైర్యాన్ని లేషమాత్రం తగ్గనివ్వడు. కంచెదాటి నేలను తాకితే ఖడ్గచాలనం చేస్తాడు.
నరేంద్ర మోదీ ధైర్యానికి సర్వనామం. సాహసానికి చిరునామా. ఇన్ని ఉద్వేగాల మధ్య, సవాలక్ష ఉద్విగ్నతల మధ్య, లెక్కతెలియని ఉద్రేకాల మధ్య ఒక పాలకుడు శిఖరంపై నిలబడి సమదృష్టితో ఓదార్చాలి.
సాంత్వనకు మరోపేరు ప్రధాని నరేంద్ర మోదీ.
ప్రధాని నరేంద్ర మోదీ….అక్షరాలా 2వేల 190రోజులు ఈ దేశానికి కాపలా కాశారు. సరిహద్దునూ…సైన్యాన్నీ…సామాన్యుణ్నీ….కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
ఒక ఆశ్వాసన, ఒక ధైర్యం, ఒకే ఒక వాగ్దానం, కించిత్ నమ్మకం, మరింత ప్రేమ….మాటలో పలకాలంటే….సుతిమెత్తని హృదయమే కాదు, శతృవుని చిత్తుచేయగల వ్యూహం ఉండాలి. మేధను యుద్ధంలోకి అనువదించాలి. మనసును పాషాణం వలె మార్చాలి…కనీసం కొన్ని క్షణాలపాటైనా….
ఏలికకూ…పాలితుడికీ మధ్య ప్రాకారాల్ని కూలదోసాడు మోదీ. మనసు విప్పి మామూలు జనంతో మాట్లాడాడు. సీక్రేట్ లాకర్లలో దాగిన కరెన్సీ కట్టలను బయటకు తీశాడు.
మోదీ అంటే మాస్టర్ స్ట్రోక్! ప్రళయాన్ని ఒంటిచేత్తో నిలువరించి….ప్రశాంతతను వాగ్దానం చేసిన ధీరోదాత్తత మోదీ సొంతం. సంతాపాన్ని సింహాసనంగా పోతపోసే రాజకీయాల అసలు రంగును బయటపెట్టిన అసలు సిసలు రాజనీతిజ్ఞుడు నరేంద్ర భాయ్ మోదీ.
మృత్యువు ముంచుకువచ్చినపుడు జోలపాటపాడి నిద్రపుచ్చలేదు. కల్హణుడి కశ్మీరాన్ని కత్తుల మైదానంలో వదిలేయలేదు.
చమురు అడుగంటి గొడిగట్టిపోతున్న దీపాన్ని గాలి తరగ ఆర్పేయకుండా అరచేతులు అడ్డుపెట్టి వెలుగును కాపాడింది నరేంద్ర మోదీయే అంటే నమ్మకం కలగకపోవచ్చు.
హిమాలయ పర్వత సానువుల్లో రక్తపు వృక్షాలు మొలుస్తున్నాయంటే….నిలువరించిన వారెవరంటే ఉత్తరక్షణం వచ్చే జవాబు భారత ప్రధాని నరేంద్ర మోదీ.
మిణుగురు వలె మిణుకు మిణుకుమంటున్న నమ్మకాన్ని వెలుతురు చిమ్మే ఆకాశాన్ని చేసింది మోదీయే….
ఆరేళ్ల కాలం…అంత సుదీర్ఘమైందేమీకాదు. మోదీ 2.0లో గడిచింది కేవలం ఏడాది మాత్రమే!
మంగోల్ పీఠభూమి నుంచి కత్తులు దూసుకువస్తున్నాయి. బోలాన్ పర్వత శ్రేణుల నుంచి బరిసెల వర్షమే కురుస్తోంది.
సరిహద్దులన్నీ….యుద్ధ క్షేత్రాలుగా మారుతున్న వేళ, ఆధీనరేఖలన్నీ….స్వాధీనం కోల్పోతున్నవేళ ఒక సాహసి కావాలి. భారత చిత్రపటానికి కాపలా కాసే సైనికుడు కావాలి….
నరేంద్రమోదీ అంటే ’నమ్మకం’
వెలుగులు విరజిమ్మే ఆరిపోని దీపం…. ఆరేళ్ల మోదీ పాలన….దేశాన్ని స్వర్గతుల్యం చేసిందని కాదు. చేస్తుందనే ఆశ ఒకటి మనలో ఎప్పటికీ ఉండాలని..